కరోనా ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తుంది. ఓ వైపు వ్యాధి విజృంభిస్తుంటే మరో వైపు టీకా కోసం దేశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తున్న కంపెనీలు చివరి దశ ట్రయల్స్లో ఉన్నాయి. ఇక పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ను బుక్ చేసుకొని దర్జాగా ఉన్నాయి.
పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ కూటమి రూపొందించిన తాజాగా నివేదిక ప్రకారం..కరోనా టీకాల తొలి డోసుల్లో అధిక శాతం ఇప్పటికే ధనికదేశాల పరం కావడంతో పేద దేశాలకు ఇబ్బందులు తప్పవని తేలింది . డబ్భై పేద దేశాల్లోని జనాభాలో 90 శాతం మందికి వచ్చే కరోనా టీకా అవకాశమే లేదని ఈ నివేదిక తేల్చి చెప్పింది. ప్రపంచ జనాభాలో 14 శాతం వాటా కలిగిన ధనిక దేశాల్లో 53 శాతం టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయని సమచారం. కెనెడా చేసిన కొనుగోళ్లతో ఆ దేశంలోని ప్రతి వ్యక్తికీ ఏకంగా ఐదు సార్లు టీకా వేయచ్చని కూడా ఈ నివేదికలో వెల్లడైంది.
ఈ ట్రెండ్ను గనుక ఇతర ధనిక దేశాలు ఫాలో అయితే పేద దేశాలకు మరింత గడ్డు పరిస్థితులు తప్పవని పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ హెచ్చరించింది. ఆమ్నెస్టి ఇంటర్నెషనల్, ఆక్స్ఫామ్, గ్లోబల్ జస్టిస్, ఫ్రంట్లైన్ ఎయిడ్స్ స్వచ్ఛంధ సంస్థలు సంయుక్తంగా ఈ అలయన్స్ను ఏర్పాటు చేశాయి. బడా ఫార్మా కంపెనీల రూపొందించిన కరోనా టీకాల తొలి డోసుల్లో అధిక శాతం పాశ్చాత్య ధనిక దేశాల పరమవడంతో ఆల్పాదాయ దేశాలు అలమటించక తప్పదని తెలుస్తోంది. మరి కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఎన్ని దేశాలు వ్యాక్సిన్ను అందుకుంటాయో వేచి చూడాలి.