దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఇప్పటికి కాదు. గత కొన్నేళ్ల నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అది వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఇటీవల బీజేపీకి చెందిన పలువురు రజినీకాంత్కు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం సాగుతోంది.
బీజేపీలో పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. జూన్లో కర్ణాటకలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వారిలో ఒకరైన అశోక్ గస్తీ ఇటీవల కరోనా సోకి మృతి చెందారు. దీంతో కర్నాటకలో ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగాల్సి వుంది. డిసెంబర్ ఒకటిన ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ సీటు ఎవరికి ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. ఇందులో ప్రధానంగా ముగ్గురి పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇందులో రజినీకాంత్, ఖుష్బూ, తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఐపీఎస్ అధికారి అన్నామలై పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో రజినీకాంత్ విషయం గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే రజినీకాంత్ పార్టీ పెడతారని అంతా అనుకుంటున్నారు. కాగా ఆయన ఆరోగ్య సమస్యల దృష్ట్యా వైద్యుల సూచన మేరకు ఆయన బయటకు రాకుండా ఉంటే మంచిదని తెలుస్తోంది. దీంతో ఆయన ఇప్పట్లో పార్టీ పెడతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆయన ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాలని చూస్తుంటే.. బీజేపీ నేతలు రాజ్యసభకు ఆయన్ను పంపాలన్న ఆలోచన ఎందుకు చేస్తున్నారన్నది తెలియాల్సి ఉంది. ఇక ఖుష్బూ ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
ఈ పరిస్థితుల్లో రజినీ కాదంటే.. ఖుష్బూకు అవకాశం దక్కేట్లు ఉంది. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానవర్గం ఖుష్బూను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని భావిస్తోంది. ఆ సీటుకు ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై బీజేపీ అధిష్టానవర్గం పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతోంది. కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనవాయితీగా వస్తోంది. నటి ఖుష్బూను రాజ్యసభకు ఎంపిక చేస్తే రాష్ట్రంలో పార్టీకి ఇమేజ్ మరింత పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు భావిస్తున్నారు. ఈ నెల పది తర్వాత ఇద్దరిలో ఒకరిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేస్తుందని, మెజారిటీ నేతల అభిప్రాయం మేరకు ఖుష్బూకు ఆ పదవి వరిస్తుందని తెలుస్తోంది.