సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. అతి కొద్దిరోజుల్లో ఆయన పార్టీ ప్రకటన రానుంది. దీంతో పార్టీ జెండా, గుర్తులతో పాటు అభ్యర్థుల విషయంలో కూడా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి.
రజినీకాంత్ అన్నాత్తే షూటింగ్లో పాల్గొనాల్సి ఉండటంతో అప్పటిలోపే పార్టీపై పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం సమావేశం నిర్వహించగా.. మరోసారి గురువారం కూడా సమావేశాలు జరిగాయి. కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపం లో మక్కల్ మండ్రం జిల్లా శాఖ నేతలు, నియోజ కవర్గాల ఇన్ఛార్జిలతో రజనీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రజనీ సలహాదారులుగా ఉన్న తమిళురివి మణియన్, అర్జున్ మూర్తి కూడా పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ మహానాడు నిర్వహించడం, నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల ను ఎంపిక చేయడం, ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే విషయాలపై రజనీ మండ్రం నేత లతో సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో గురువారం మళ్ళీ మక్కల్మండ్రం నేతలతో ఎలాంటి హాడావుడి లేకుండా రజనీ సమావేశమయ్యారు.
పార్టీకి ఏంపేరు పెట్టాలనే విషయంపై కూడా తీవ్రంగా చర్చలు జరిపారు. పార్టీ పేరులో ‘కళగం’ అనే పదం లేకుండా ఉండాలని మండ్రం నేతల్లో చాలా మంది రజనీకి సూచించారు. ప్రజలు పలికేందుకు సులువగా ఉండేలా పార్టీకి పేరుపెట్టాలని కోరారు. ఇక పార్టీ గుర్తుగా సైకిల్ను ఎంపిక చేయాలని మండ్రం నేతలంతా రజనీకి సూచించారు. రజనీ నటించిన అన్నామలై చిత్రంలో పాలవాడిగా సైకిల్పై పాడే పాటను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడం ప్లస్పాయింట్ అవుతుందని కూడా తెలిపారు.