రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉంటేనే అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర గవర్నర్కు కూడా మంచి సత్సంబంధాలే ఉండాలి. లేదంటే గవర్నర్ తీసుకోవాల్సిన కీలక నిర్ణయాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం నెలకొంది. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, గవర్నర్కు ఏమాత్రం సరిపోవడం లేదు.
ఈ పరిస్థితి ఏర్పడింది పశ్చిమబెంగాల్లో. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని గవర్నర్ ధన్కర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికే పెద్ద మచ్చ అని అన్నారు. నిప్పుతో చెలగాటమాడరాదని తీవ్ర స్వరంతో మమతా బెనర్జీని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి మమత కచ్చితంగా రాజ్యాంగాన్ని అనుసరించాలని, రాజ్యాంగ పంథా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె పక్కకు వెళ్లరాదని సూచించారు. చాలా రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో దిగజారిన ప్రజాస్వామ్య విలువలపై తాను కేంద్రానికి ఓ రిపోర్టు పంపినట్లు ఆయన వెల్లడించారు.
దాడి విషయంలో మమత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని, ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలాంటి మాట్లాడటమేంటని గవర్నర్ సూటిగా ప్రశ్నించారు. బెంగాల్ సంస్కృతి, రాజ్యాంగం ప్రకారం ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం సరైనవి కావని ఆయన పేర్కొన్నారు. ‘‘మేడమ్… దయచేసి హుందాతనం పాటించండి. దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి’’ అని సీఎం మమతకి గవర్నర్ ధన్కర్ సూచించారు.