సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు కోరుకోవడం ఇప్పటిమాట కాదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రజినీకాంత్ టాపిక్ వస్తుంది. ఈ ఎన్నికల్లోనైనా రజినీ పోటీ చేసి సీఎం అవుతారని అంతా అనుకుంటూనే ఉండగా.. ఆయన మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే అంటూ వస్తున్నారు.
అయితే రజినీకాంత్ నవంబర్లో పార్టీ ప్రారంభిస్తారన్న వార్తలు ఎక్కువయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే కార్యచరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు పక్కకు పెట్టి కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే తాము పోటీ చేస్తామని రజినీ అప్పట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొలిటికల్ ఎంట్రీకి టైం దగ్గర పడినట్లు అక్కడి వర్గాలు చెబుతున్నాయి.
మరో రెండు నెలల్లో కరోనా ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుందన్న వార్తల నేపథ్యంలో ఇదే అదునుగా రజినీ పార్టీ ప్రారంభం ఉండనున్నట్లు తెలుస్తోంది. మధురైలో పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భారీ బహిరంగ సభ పెట్టి పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్రమంతా పర్యటనకు కూడాప్లాన్ చేస్తున్నారంట. కాగా రజినీ పార్టీ పెడితే మద్దతు తెలిపేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు.
రజినీ ప్రజా సంఘాల నాయకులు సైతం రజినీ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఇది జరుగనుందని కీలక నాయకుల ద్వారా సమాచారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ స్థాపించిన తర్వాత సీఎం పదవిలో ఐ.ఏ.ఎస్, ఐపిఎస్, మేధావినో కూర్చోబెట్టి తాను పార్టీ అధ్యక్షుడిగానే ఉంటానని ఇప్పటికే రజినీ చెప్పేశారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది.