బీహార్ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ చాలా సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. నేడు బీహార్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దీంతో నేతలంతా ఓటింగ్ ఏ విధంగా ఉందన్న దానిపై దృష్టి పెట్టారు.
ఎన్నికల పోలింగ్ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటేనే తాము కోరుకున్న కొత్త ప్రభుత్వం వస్తుందని అన్నారు. బీహార్లోని కోర్హా, కిషన్గంజ్ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు రాహుల్ వెల్లడించారు. పెరుగుతున్న నిరుద్యోగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, బలహీన ఆర్థిక వ్యవస్థపై మాట్లాడతానన్నారు. బీహార్లోని కొన్ని జిల్లాల్లో ఇవాళ రెండో దశ పోలింగ్ జరగనుందని అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. అప్పుడే మీరు కోరుకునే కొత్త ప్రభుత్వం వస్తుంది అని ట్వీట్ చేశారు.
రెండో దశ పోలింగ్లో మొత్తం 2.85 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 17 జిల్లాల్లోని 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ దాదాపు 1500 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ బీహార్ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులను తనదైన శైలిలో మోదీ విమర్శిస్తున్నారు. నితిష్ వైపు అభివృద్ధి ఉందని చెబుతూ ప్రతి ప్రచారంలో మోదీ స్టైల్ చూపిస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో మోదీ నితిష్ గురించి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.