ప్రభుత్వ అధికారులు రైతుల నుంచి లంచం అడిగితే ఉరిశిక్ష వేయాలని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతుల నుంచి వరిధాన్యాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వపరంగా అవసరమైనంత మేరకు కొనుగోలు కేంద్రాలు, గోదాముల సదుపాయం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన సూర్య ప్రకాశం అనే వ్యక్తి హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తుల బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ విచారణ సందర్బంగా అదే సమయంలో రైతుల వద్ద గోదాముల కోసం అధికారులు ఎవరూ లంచం అడగటం లేదని, అవకతవకలకు పాల్ప డ్డారనే ఆరోపణలపై 105 మంది అధి కారులపై చర్యలు తీసుకున్నామని రాష్ట్ర వినియోగదారుల వాణిజ్య మం డలి మేనేజింగ్ డైరెక్టర్ రాధాదేవి తెలిపారు.
అధికారులు లంచం తీసుకోవడం లేదని చెబుతూనే.. పలువురు అధికారులు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవడం ఏంటని న్యాయమూర్తులు అన్నారు. ఈ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని.. అధికారులు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో నివేదికలో స్పష్టం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా జరిగివుంటే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎంతో కష్టపడి పంటలు పండించే రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు గిట్టు బాటు దర లేక, వాటిని నిల్వ ఉంచుకునేందుకు గోదాములు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న అన్నదాతల నుంచి లంచం తీసుకునే అధికారులకు ఉరిశిక్ష విధించాలని న్యాయ మూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. కేసు తదుపరి విచారణను ఈనెల తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు.