దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రస్ ఘటన ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. హత్రాస్ బాధితురాలిపై సెప్టెంబరు 14న అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే, అదేనెల 29న ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు చేస్తోంది.
ఈ విషయం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. హత్రాస్ కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అన్యాయం చేస్తుండటం సహించరానిదని స్పష్టం చేశారు. హత్రాస్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. వీరి జీవన పరిస్థితులు గృహ నిర్బంధంలో ఉన్నట్లు కనిపిస్తున్నాయని ఉత్తర ప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) ఆరోపించింది.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఈ కేసు దర్యాప్తును అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. బాధితులు నిరంతరం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లో అన్యాయానికి గురవడం సహించరానిదని తెలిపారు. హత్రాస్ అత్యాచారం, హత్య కేసులో ప్రభుత్వం నుంచి సమాధానాలను యావత్తు దేశం కోరుకుంటోందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు అండగా ఉందన్నారు. కాగా దేశం మొత్తం హథ్రస్ ఘటనతో ఉలిక్కి పడిన విషయం తెలిసిందే.