అమెరికాలో రాజకీయాలు ఇంకా టెన్షన్గానే ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మాత్రం ఇంకా ఎన్నికల గురించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పలు చోట్ల మళ్లీ ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు.
జార్జియాలో ఓట్లు మళ్లీ లెక్కించాలంటూ ట్రంప్ క్యాంపెయిన్ పిటిషన్ ఫైల్ చేసింది. జార్జియాలో అతి స్వల్ప ఓట్ల మెజారిటీతో జో బైడెన్ గెలవగా.. అధికారులు రీకౌంటింగ్ను నిర్వహించి లక్షల ఓట్లను మళ్లీ లెక్కించారు. రీకౌంటింగ్లోనూ జో బైడెన్ 12,670 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1992 తర్వాత జార్జియాలో డెమొక్రాటిక్ పార్టీ విజయం సాధించడం ఇదే మొదటిసారి. అయితే జో బైడెన్ గెలుపుపై ట్రంప్, ఆయన క్యాంపెయిన్ ఆరోపణలు చేస్తూనే ఉంది.
జార్జియా రాష్ట్ర చట్టం, అమెరికా రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని అనుసరించి చట్టబద్దమైన ప్రతి ఒక్క ఓటును లెక్కించే దానిపై మేము దృష్టి సారించినట్లు ట్రంప్ క్యాంపెయిన్ తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్, ఆయన క్యాంపెయిన్ నిజాయితీతో కూడిన రీకౌంటింగ్ కోసం పట్టుబడుతూనే ఉందని తెలిపింది. ఓట్లలో సంతకం కూడా మ్యాచ్ అవ్వాలి. సంతకం మ్యాచ్ అవ్వకపోతే ఈ రీకౌంటింగ్ మోసపూరితమైనది అవుతుందని అంటోంది. కాగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లను గెలుపొందగా.. ట్రంప్ కేవలం 232 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే సాధించారు. అధ్యక్ష పదవి చేపట్టడానికి 270 మ్యాజిక్ ఫిగర్ను చేధించాల్సి ఉంటుంది. ట్రంప్ ఒకవేళ ఈ రాష్ట్రంలో గెలిచినా అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యే అవకాశం లేదు.