ప్రపంచ దేశాలను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఓ సారి దేశాలను గడగడలాడించిన కరోనా ఇప్పుడు మరోసారి విజృంభిస్తోంది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. అమెరికాలో ప్రస్తుతం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
యూఎస్లోని ప్రజలు రికార్డు స్థాయిలో మహమ్మారి బారినపడుతున్నారు. ప్రముఖ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 12 మిలియన్లు దాటింది. యూనివర్సిటీ రియల్ టైమ్ ట్రాకర్లోని సమాచారం ప్రకారం ఆరు రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది మహమ్మారి బారినపడటంతో.. అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,20,19,960కు చేరింది. ఇదే సమయంలో అమెరికాలో ఇప్పటి వరకు 2,55,414 మంది కరోనా కాటుకు మరణించారు.
ఇదిలా ఉంటే.. కరోనా కేసులు విపరీతంగా పెరిగుతుండటంతో అమెరికాలోని పలు పట్టణాలు తిరిగి ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటికి రావొద్దని ప్రజలను అధికారులు కోరుతున్నారు. న్యూయార్క్ సిటీలో స్కూళ్లు మళ్లీ మూతపడగా.. కాలిఫోర్నియాలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. అమెరికాలో మూడో అతిపెద్ద నగరమైన చికాగోలో సోమవారం నుంచి స్టే హోం ఆదేశాలు అమలు కానున్నాయి.
కాగా ప్రజలు డిజిన్ఫెక్టెంట్ వైప్స్, క్లీనింగ్ స్ప్రేస్, డిస్పోజబుల్ గ్లోవ్స్, పేపర్ గూడ్స్, క్లీనింగ్ సప్లయ్స్ వంటివాటిని పెద్ద ఎత్తున కొంటున్నారు. అత్యవసర సరుకులను మితిమీరి కొనడం మళ్లీ ప్రారంభించారు. దీంతో దుకాణదారులు కొనుగోళ్ళపై పరిమితులు విధిస్తున్నారు. సరుకులు అందుబాటులో ఉంటాయని, భయాందోళనలకు గురికావద్దని ప్రజలను కోరుతున్నారు. క్లీనింగ్ ప్రొడక్ట్స్, టాయ్లెట్ పేపర్, కోల్డ్, ఫ్లూ మందులు, షెల్ఫ్ స్టేబుల్ ఫుడ్ వంటివాటిని ప్రజలు విపరీతంగా కొంటున్నారు