ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దైన శైలిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇటీవల మోదీ దిష్టిబొమ్మలు దగ్దం చేసిన విషయం తెలిసిందే. దీనిపై దుమారమే రేగింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. నరేంద్ర మోదీ మన ప్రధాని అని చెప్పారు.
చంపారన్లో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. దసరా ఉత్సవం సందర్భంగా మోదీ దిష్టి బొమ్మలు కాల్చడం చూసి ఆశ్చర్యపోయామన రాహుల్ గాంధీ అన్నారు. ఇది చాలా విచారకరమని, మోదీ దేశ ప్రధాని అని, అలా చేయకూడదని అన్నారు. బిహార్ యువతకు ఉద్యోగ, ఉపాధి లభించడం లేదని, ఎందుకుంటే సీఎం నితీశ్ అత్యంత బలహీనంగా ఉన్నారని విమర్శించారు. ఉద్యోగాలను కల్పిస్తామని వాగ్దానాలు చేస్తారని, కానీ వాటిని నెరవేర్చని మండిపడ్డారు. దేశంలో లాక్డౌన్ విధించడం, పెద్ద నోట్ల రద్దు.. రెండూ ఒకే లక్ష్యాలతో కూడుకున్నవని, చిన్న వ్యాపారులను దెబ్బ తీయడమే వీటి లక్ష్యమని రాహుల్ ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా మోదీపై రాహుల్ విమర్శలు చేశారు. బిహార్ శక్తిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని, గాంధీజీ కూడా స్వాతంత్ర్యోద్యమాన్ని చంపారన్ నుంచే ప్రారంభించారని రాహుల్ గుర్తు చేశారు. గతంలో మోదీ పర్యటించిన సందర్భంలో చక్కెర ఫ్యాక్టరీని నెలకొల్పి, ఛాయ్ తాగుతామని మోదీ ప్రకటించారని, ఇప్పటి వరకూ మోదీ చాయ్ తాగారా అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో ఉద్యోగాల కల్పనపై ప్రధాని మోదీ ప్రకటనలివ్వరని, ఎందుకంటే ఆయన మాటలను నమ్మే స్థితిలో బిహార్ ప్రజలు లేరని రాహుల్ ఎద్దేవా చేశారు. చిన్న వ్యాపారులను తుడిచిపెట్టేసే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, లాక్డౌన్ కారణంగా చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారని అన్నారు.