కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటోంది. అయితే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాహుల్ ఇండియాలో లేరు. ఆయన ఇటలీ వెళ్లారు. రాహుల్ గాంధీ ఆదివారం ఇటలీకి వెళ్లారు. వ్యక్తిగత పనిమీదే వెళ్లారని పార్టీ పేర్కొంది. అయితే అక్కడ ఉంటున్న అమ్మమ్మను కలవడానికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేకపోయారు. అందుకే ట్విట్టర్ వేదికగా రాహుల్ స్పందించారు.
ఆయన ఏమన్నారంటే.. దేశ హితం కోసం గొంతెత్తడానికి తమ పార్టీ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సత్యం, సమానత్వం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యం, సమానత్వం కోసం ఈ ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తున్నాం. జై హింద్ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్రంపై మరోసారి మండిపడ్డారు. రైతుల విషయంలో కేంద్రం వాడుతున్న భాష ఏమాత్రం సరిలేదని మండిపడ్డారు. అలాంటి భాష వాడటం మహా పాపమని వ్యాఖ్యానించారు. కేంద్రం రైతులకు కచ్చితంగా జవాబుదారీగా నడుచుకోవాల్సిందేనని ఆమె సూచించారు. కేంద్రం వెంటనే రైతులతో చర్చించాలని ప్రియాంక డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ 136 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో సీనియర్ నేత ఏకే ఆంటోనీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు ఆజాద్, ఖర్గే తదితరులు పాల్గొన్నారు. విదేశాలకు వెళ్లిన కారణంగా రాహుల్, అనారోగ్యం దృష్ట్యా సోనియా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం.