వరుస పరాజయాలతో సతమతమవుతోన్న హీరో రామ్కు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కు ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా రామ్ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, ఇక రామ్ ‘రెడ్’ చిత్రీకరణలో ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే పూరీ, రామ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న తర్వాతి చిత్రం ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ విడుదల సమయంలోనే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పూరీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ఇది కచ్చితంగా సీక్వెల్ అనే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాలి.