నట సింహం బాలక్రిష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2017లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయినా.. బాలకృష్ణలోని మరో యాంగిల్ను ప్రేక్షకులకు చూపించింది. హీరోయిజానికి సరికొత్త అర్థం చెప్పే పూరీజగన్నాథ్.. బాలయ్య బాబు మేనరిజాన్ని కూడా ఈ సినిమాతో పూర్తిగా మార్చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలకృష్ణ తన తర్వాతి చిత్రాన్ని పూరీజగన్నాథ్తో చేయనున్నాడని తెలుస్తోంది.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇక పూరీజగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి సినిమాలు పూర్తయిన తర్వాత కొత్త సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే పూరీ ఒక స్టోరీ లైన్ను బాలయ్యకు వినిపించాడని దానికి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫైటర్ తర్వాత పూరీజగన్నాథ్ రామ్తో మరోసారి చేతులు కలుపనున్నట్లు వార్తలు వచ్చాయి. మరి పూరీ వీరిద్దరిలో తొలుత ఎవరితో సినిమాను మొదలు పెట్టనున్నాడో చూడాలి.