చెన్నైలో దొంగలు రెచ్చిపోయారు. ఓ నగల దుకాణంలో ఏకంగా రెండు కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చుట్టూ రద్దీ ఉండే ప్రాంతంలో ఇది జరగడం ఇప్పడు కలకలం రేపుతోంది. స్థానికంగా ఇంకేం జరుగుతుందో అన్న భయం అందరిలోనూ నెలకొంది.
స్థానిక టి.నగర్ బస్టాండు సమీపంలోని మూసా వీథిలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో కింద, పైన అంతస్థుల్లో నివాసం ఉంటున్నారు. ఓ ఫ్లాట్లో రాజేంద్రబాబు, ఆయన కుమారులు తరుణ్, భరీష్ నివసిస్తున్నారు. దిగువ అంతస్థులో తరుణ్, భరీష్ ఉత్తమ్ జ్యువెలరీస్ పేరిట నగల దుకాణం నడుపుతున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరూ దుకాణాన్ని మూసి ప్లాట్కు వెళ్ళిపోయారు. బుధవారం ఉదయం దుకాణం తెరిచేందుకు రాగా దుకాణం ఇనుప గ్రిల్ గేట్ పగిలిపోయింది. దుకాణం తలుపు పగులగొట్టి దొంగలు లాకర్లో భద్రపరచిన నాలుగు కేజీలకు పైగా బంగారు, వజ్రాభరణాలు, బంగారు కడ్డీలు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
టీ నగర్ బస్టాండ్ సమీపంలో ఈ దోపిడీ జరగడం సంచలనం సృష్టించింది. అయితే ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్ చెన్నై డిప్యూటీ పోలీసు కమిషనర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్లు కలియాన్, రూబెన్ ఇతర పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇక్కడ బంగారాన్ని చిల్లర దుకాణంగా జరపడం లేదు. కేవలం టోకుగా బంగారు, వెండి ఆభరణాలు విక్రయిస్తున్నారు. కాగా పోలీసులు దుకాణంలో పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నారు. దుకాణంలో వేలిముద్రలు కూడా సేకరించారు. స్థానికంగా ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రూ. 2 కోట్ల విలువైన ఆభరణాలు మిస్ అవ్వడంతో ఈ కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. కాగా దుకాణంపై ప్లాన్ ప్రకారమే ప్లాన్ చేసి దొంగిలించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాంబళం పోలీసులు కేసు నమోదు చేశారు. దసరా, దీపావళి పండుగల కోసం దుకాణంలో అధికమొత్తంలో నగలు, వజ్రాభరణాలు తీసుకొచ్చి పెట్టారని తెలుస్తోంది.