ఇప్పుడు అందరూ ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ తినడం వల్ల 9 మంది చనిపోయారన్న వార్త హల్ చల్ చేస్తోంది. చైనా, హీలాంగ్జియాంగ్ నార్త్ ఈస్ట్రన్ ప్రావిన్స్లోని జిసి నగరానికి ఓ ఫ్యామిలీ వీటిని తిని తీవ్ర అస్వస్థతకు గురైంది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ వీరంతా చనిపోయారు.
ఏం జరిగిందంటే.. దాదాపు ఒక సంవత్సరం పాటు ఫ్రిజ్లో ఉంచిన సు అన్ టాంగ్జీ అంటే నూడిల్స్తో తయారుచేసిన ఓ వంటకాన్ని తిన్నారు. ఆ తర్వాత తిన్న 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని హాస్పిటల్కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అక్టోబర్ 10వ తేదీన 8మంది, సోమవారం మరో మహిళతో కలిపి మొత్తం 9 మంది చనిపోయారు. అయితే ఈ విషయమై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ బాంగ్ క్రెక్ అనే విషం కారణంగా వీరు చనిపోయారని.. ఇది చెడిపోయిన పదార్థాలలో ఉంటుందని తెలిపారు.
అయితే ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే ఇదే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు ఈ నూడిల్స్తో చేసిన వంటకం ఇష్టంలేక తినడం మానేశారు. దీంతో వీరు ఈ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. లేదంటే అందరితో పాటు వీరు కూడా అస్వస్థతకు గురయ్యేవారు. కాగా బాంగ్క్రెక్ అనే విషం కొబ్బరి పదార్థాలను ఎక్కువ రోజులు పులియబెట్టడం వల్ల ఉత్పత్తి అవుతుంది. ఇది తీసుకున్న వెంటనే కడుపునొప్పి, చెమట పడ్డటం, నీరసం, కోమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క సారి 24 గంటల్లో మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇండోనేషియన్ సంప్రదాయ వంటకం టెంపె బాంగ్క్రెక్ను నిషేధించారని అంటారు. దీన్ని బట్టి ఎక్కువ రోజులు నిల్వ చేసిన పదార్థాలను తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు.