అవకాశం దొరికితే కేంద్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉంది. ఇప్పటికే పలు మార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో చురకలు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రియాంకా గాంధీ కూడా మోదీపై సెటైర్లు వేశారు.
దేశంలో ఒకే ఎన్నికలు ఉండాలని మోడీ చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని కూడా చెప్పారు. అయితే అది జరగలేదు. దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇక గురువారం కూడా మోదీ జమిలి ఎన్నికలపై మాట్లాడారు. లోక్సభ, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా ఉండాలన్నారు. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ జరగవలసిన అవసరం ఉందన్నారు.
దీనికి ప్రియాంకా గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘‘రైతుల గళాలను అణచివేసేందుకు – వారిని నీటిలో తడుపుతున్నారు, వారిని ఆపేందుకు రోడ్లను తవ్వుతున్నారు. ఎంఎస్పీని పొందేందుకు చట్టబద్ధమైన హక్కు ఉన్నట్లు ఎక్కడ రాశారో వారికి చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం శ్రద్ధచూపుతున్న ప్రధాన మంత్రి ‘ఒక దేశం-ఒకే ప్రవర్తన’ను అమలు చేయాలి’’ అని కోరారు. పంజాబ్ రాష్ట్రాల నుంచి రైతులు ‘ఢిల్లీ చలో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.