ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ వ్యాప్తంగా విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రమేష్ హాస్పిటల్స్ ఆద్వర్యంలో స్వర్ణప్యాలెస్ హోటల్లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించారు. అయితే అక్కడ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పది మంతి కోవిడ్ రోగులు చనిపోయారు. ఈ విషయంలో అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ కేసులు ఇప్పుడు డాక్టర్ రమేష్ను విచారించేందుకు హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది.
స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ క్వారంటైన్ సెంటర్ దగ్ధం కేసులో హైకోర్టు నేడు విచారణ నిర్వహించింది. డా.రమేష్బాబును విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. మూడు రోజుల పాటు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్లో విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిర్వహించాలని తెలిపింది. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రమేష్ బాబు న్యాయవాది పరివేక్షణలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.
స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి గవర్నర్పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేశ్బాబు, చైర్మన్ ఎం.సీతారామ్మోహనరావులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు వారిపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా… తాజాగా మంజూరు చేసింది. దీంతో స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ఇన్ని రోజులు తప్పించుకు తిరిగిన రమేష్ బాబు పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు.