ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటి ముగిసింది. ఈ భేటిలో పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గం తీసుకుంది. పేదలకు ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలు, నివర్ తుఫాను నష్టాల అంచనా వంటి కీలక నిర్ణయాలు సీఎం జగన్ అధ్యక్ష్యతన తీసుకున్నారు.
డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 28లక్షల 30వేల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ హౌసింగ్ కాలనీల నిర్మాణం, డిసెంబర్ 8న 2.49లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి 105 ఎకరాల భూ సేకరణ, 2019 ఖరీఫ్ ఉచిత పంటల బీమా పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
నివర్ తుపానుపై కేబినెట్లో చర్చించారు. 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉద్యోగులు, పింఛన్దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించారు. 3.144 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 2 నుంచి ఏపీ అమూల్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. తొలిదశలో ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో 9,889 బల్క్ చిల్లింగ్ అభివృద్ధికి నిర్ణయించారు.