ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో కరోనా కలకలం రేపింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని మరీ ఆలయాన్ని తెరిచారు అధికారులు. అయినప్పటికీ పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆలయంలో కొంతమేర ఆందోళన నెలకొంది.
ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు తెలిపిన వివరాల ప్రకారం 27 మంది ఆలయ సిబ్బంది సహా 39 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా నేపథ్యంలో శబరిమల ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. అయితే వార్షిక పూజల నేపథ్యంలో నవంబర్ 16వ తేదీ నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతి ఇస్తున్నారు. కరోనా నేపథ్యంలో రోజుకు వెయ్యి మందిని, వారం చివరి రోజుల్లో 2 వేల మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి ఆహ్వానిస్తున్నారు.
కరోనా మార్గదర్శకాలు పాటిస్తున్న నేపథ్యంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడినట్లు తెలిసింది. సన్నిదానం, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో 39 కేసులు వెలుగుచూశాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో భక్తులు వచ్చే బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలో యాంటిజెన్ టెస్టులు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 10 సంవత్సరాల వయస్సు నుంచి 60 ఏళ్ల వయస్సున్న వారిని మాత్రమే ఆలయంలోకి దర్శనానికి అనుమతిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన వైద్య బృందాలు ఆలయంలో విధులు నిర్వహిస్తున్నాయి. మొత్తానికి ఆలయంలో కరోనా కేసులు బయటపడటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.