తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఊరట కలిగించే చర్యలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అంతరాష్ట్ర సర్వీసులకు మార్గదర్శకాలు ఇవ్వడంతో ఏపీ నుంచి తెలంగాణాకు ప్రైవేటు బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రయాణీకులు అన్ని నిబంధనలు పాటించి బస్సులు ఎక్కాల్సి ఉంటుంది.
అన్లాక్ 4.0 భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో ప్రధానంగా మెట్రో సర్వీసులు, అంతరాష్ట్ర సర్వీసులకు ఓకే చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు రెవెన్యూ అధికారుల అనుమతితో బస్సులను నడుపుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు.
ఇటీవలె ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు బస్సు సర్వీసుల రాకపోకలపై సుధీర్ఘంగా చర్చించారు. అయితే మరోసారి వీరు భేటి అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా అనుమతులు రావడంతో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ప్రయాణీకుల కోసం బస్సులను తిప్పుతున్నాయి. బస్సు ఎక్కాలనుకునే వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బస్సులో శానిటైజర్ను అందుబాటులో ఉంచారు. ప్రయాణీకుల మధ్య దూరం పాటించేందుకు కూడా యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి.
లాక్డౌన్ ప్రారంభం నుంచి బస్సు సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రమే అనుమతులు ఇవ్వడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రారంభించాయి. ఇటు ప్రజలు కూడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏపీలోని ప్రధాన నగరాల నుంచి తెలంగాణాకు 150 బస్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వీటికి ఆన్లైన్లోనే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్యను పెంచనున్నారు.