కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్లు తయారుచేసేందుకు శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. ఈ ఏడాది చివరికైనా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనైనా కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రధాని వ్యాక్సిన్ల పంపిణీపై కీలక సమాచారం బయటకు ఇచ్చారు.
కరోనా వ్యాక్సిన్ వచ్చాక ఎలా పంపిణీ చేయాలన్న దానిపై ప్రధాని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎన్నికలు, విపత్తు నిర్వహణ మాదిరిగానే కరోనా వ్యాక్సీన్ డెలివరీ వ్యవస్థ ఉండాలని ప్రధాని అన్నారు. దేశంలో ప్రతి వ్యక్తికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలన్నారు. దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణను ఏ విధంగా నిర్వహించామో గుర్తుంచుకొని వ్యాక్సిన్ పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా స్థాయి కార్య నిర్వాహకులు, పౌరసమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అవసరమైన అన్ని డొమైన్ల నిపుణులు కీలక భూమిక పోషించాలన్నారు.
కరోనా పరిస్థితితో పాటు టీకా వస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రధాని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి నుంచే వ్యాక్సిన్ పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్ర స్థాయి నుంచి పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలను బట్టి చూస్తే ఊహించిన దానికంటే ముందుగానే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా అని అనిపిస్తోంది. అయితే వ్యాక్సిన్ వస్తే ముందుగా వయస్సు మీద పడిన వారికి వేస్తారని ప్రచారం జరిగింది. ఇక ప్రధాని మాత్రం ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్నట్లు చెప్పారు. మరి దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.