కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు హీరో యశ్. ఈ సినిమాలో తన మాస్ యాక్షన్, పంచ్ డైలాగ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడీ హీరో. భాషలతో సంబంధం లేకుండా యశ్ నటనకు అభిమానులయ్యారు. ప్రస్తుతం యశ్ కేజీఎఫ్-2 చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మాస్ హీరో.. మాస్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన పూరీ జగన్నాథ్తో చేతులు కలపనున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే యశ్కు పూరీ ఓ కథను వినిపించాడని, దానికి యశ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పూరీజగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే యశ్తో సినిమా మొదలుపెట్టనున్నాడని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ మాత్రం సెట్ అయితే బొమ్మ అదిరిపోతుందని పూరీ అభిమానులు భావిస్తున్నారు.