దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించారు.
ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో దీనిపై కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులు, కోవిడ్ వ్యాప్తి అంశాలపై చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాత్మకత మూడో దశలో ఉన్న నేపథ్యంలో… వ్యాక్సిన్ పంపిణీ ఎలా చేయాలన్న దానిపై కూడా మోదీ సీఎంలతో చర్చించనున్నారు.
అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ రెండు దఫాలుగా జరగనుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ పై నీతి ఆయోగ్ ఓ సమావేశాన్ని నిర్వహించింది. వ్యాక్సిన్కు ఎంత ధర నిర్ణయించాలన్నది కూడా నీతి ఆయోగ్ సభ్యుల మధ్య చర్చకు వచ్చింది. ఇక… మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాని వ్యాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ సీఎంల ముందు ప్రధాని మోదీ పెట్టనున్నట్లు సమాచారం.