విద్యా విధానంలో మాతృ భాషకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. మాతృ భాషలో బోధిస్తేనే చిన్నారులకు అర్థమవుతుందన్నారు. విద్యను తరగతి గదులకు మాత్రమే పరిమితం చేయకూడదన్నారు.
విద్యార్థుల ప్రెజర్ షీట్.. తల్లిదండ్రులకు ప్రెస్టేజ్ షీట్ గా మారిందన్నారు. బోధనలో వినూత్న పద్దతులు అవలంబించాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. జ్నానాన్ని పొందేందుకు భాష ఓ సాధన మాత్రమేనన్నారు. కేవలం పుస్తకాల జ్ఞానానికే ప్రజలు పరిమితమయ్యారని.. భాషే జ్ఞానం కాదన్నారు.
ఇక చిన్నారులు ఇంట్లో ఏ భాష వింటారో.. పాఠశాలలో కూడా అదే భాషలో వింటేనే అర్థం చేసుకుంటారని మోదీ చెప్పారు. ఐదో తరగతి వరకు బోధన మాతృ భాషలోనే జరగాలని నూతన విద్యా విధానం చెబుతోందని ప్రధాని అన్నారు. అయితే ఇంగ్లీషుతో పాటు ఇతర భాషలు నేర్చుకునేందుకు ఎలాంటి పరిమితులు లేవన్నారు. ఇతర దేశాల్లో ప్రాథమిక విద్య మాతృ భాషలోనే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టాలని యోచిస్తున్న పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మోడీ చెబుతున్న మాటలను ఏ విధంగా అర్థం చేసుకుంటాయో చూడాలి. అయితే కచ్చితంగా ఇంగ్లీషులోనే బోధన ఉండకుండా ప్రాథమిక విద్య మాతృ భాషలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.