రాష్ట్రంలో ఎస్సీలపై జరిగిన దాడులన్నింటిపైనా సీబీఐతో విచారణ జరిపించాలన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎస్సీలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటే వారంతా తనకు కట్టుబానిసలు సీఎం జగన్ భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలు వైకాపాకు ఓటేసిన పాపానికి బడుగు, బలహీన వర్గాలు ఈ అఘాయిత్యాలు భరించాల్సిందేనా అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైద్యుడు సుధాకర్ మాస్కు కావాలని అడిగితే వేధించారని చంద్రబాబు చెప్పారు. దళితులపై జరిగిన దాడులన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని.. బాదితులకు రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని చంద్రబాబు అన్నారు.
బడుగు, బలహీన వర్గాలపై దాడులే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉంటే ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా మాట్లాడలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఢిల్లీకి ప్రతినిధుల బృందాన్ని పంపి ఎస్సీల ప్రయోజనాల కోసం పోరాడతామని చంద్రబాబు అన్నారు.