ఏపీ సీఎం జగన్ పై ప్రసంశలు కురుస్తున్నాయి. కరోనా నివారణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ బాగా పనిచేస్తోందని ఇండియాలో బ్రిటన్ తాత్కాలిక హైకమీషనర్గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్లు అన్నారు. కరోనా నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై వీరితో సీఎం వై.ఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారీగా టెస్టులు చేయడం, పాజిటివ్ కేసులు గుర్తించడంలో ఏపీ ప్రభుత్వం పనితీరు బాగుందన్నారు. టెలి మెడిసిన్ లాంటి కొత్త విధానాలు ముందుకు తీసుకెళుతున్నారన్నారు. ఏపీ మెడ్టెక్ జోన్తో ఇటీవలె అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామన్న వీరు.. కరోనా నివారణ కోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు.
అనంతరం సీఎం వై.ఎస్ జగన్ మాట్లాడారు. కోవిడ్ సోకిన వారిని వేగంగా గుర్తించి.. వారికి వైద్యం అందించి మరణాలు రేటు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే వరకు మనమంతా దానితోనే కలిసి బతకాల్సి ఉంటుంది. అందుకే మరణాల రేటైనా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.