కేరళలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 123 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది గాయాలపాలు అయ్యారు. కేరళ ప్రభుత్వం ప్రమాద వివరాలను ఈ విధంగా వెల్లడించింది. మృతుల్లో పైలెట్తో పాటు ఆరుగురు సిబ్బంది, ప్రయాణికులు వివరాలను కాసేపట్లో వెల్లడిస్తామని తెలిపింది. విమానం తీవ్రంగా దెబ్బతినడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విమాన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. అలాగే ఎయిర్ ఇండియా అధికారులకు సైతం ఫోన్ చేసి ప్రమాద ఘటన గురించి చర్చించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను మరింత ముమ్మరం చేయాలని స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించారు. సంఘటనా స్థలంలోనే బాధితులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.