ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నాయకుల్లో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన పాలనతో దేశంలో కొత్త చరిత్ర సృష్టించారని అంతా అనుకుంటున్నారు. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ లు జరుగుతున్నాయని చంద్రబాబు మోడీకి లేఖ రాశారు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆయన లేఖలో అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీలోని రాజకీయ నాయకులు, ఇతరుల ఫోన్ల ట్యాపింగ్తో తీవ్ర ముప్పు ఉందని తెలిపారు. దేశ భద్రతకే ఇది పెను ప్రమాదమన్నారు. వైకాపా పాలనలో ఏపీ ప్రజలు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారన్నారు. వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్ చేయడంలో ఎటువంటి చట్టబద్ధమైన విధానాన్ని వైసిపి ప్రభుత్వం పాటించడం లేదన్నారు.
రాజకీయ లబ్ది కోసం చట్టవిరుద్దంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో వెంటనే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు.