పార్లమెంటులో అగ్నిప్రమాదం సంభవించింది. అనెక్స్ భవనంలో ఆరవ అంతస్తులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ఘటన జరిగింది.
పార్లమెంటులో అగ్నిప్రమాదం జరగడంపై ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందారు. అయితే ఈ అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందిని హుటాహుటిన సంఘటన స్థలానికి తరలించారు. వెంటనే 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా పార్లమెంట్ అగ్నిప్రమాదంపై స్పందించిన ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించారు.
మొన్న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదంలో పది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్లమెంటులో అగ్నిప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మార్చి 23వ తేదీన వాయిదా పడ్డాయి. వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇలా అగ్నిప్రమాదం జరగడంతో చర్చనీయాంశంగా మారింది.