అమరావతిలో పెండింగ్ పనులపై తక్షణం దృష్టి పెట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి ని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని గతంలోనే నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెయ్యడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బొత్స అన్నారు. అమరావతి ప్రాంతం కూడా రాష్ట్రంలో అంతర్భాగమన్నారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారని బొత్స అన్నారు. ఇక అమరావతిలో పెండిగ్ పనులను వెంటనే ప్రారంభించాలని జగన్ ఆదేశించారన్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తామన్నారు. వీటిపై ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు బొత్స చెప్పారు.
విశాఖపట్నంలో శంకుస్థాపన చేయాలని అనుకున్నా..టిడిపి లాంటి దుష్టశక్తులు దీన్ని అడ్డుకుంటున్నాయన్నారు. ప్రతిపక్షాలు కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయన్నారు. ఇక చంద్రబాబు ఓటమి చెందినప్పటి నుంచి బాధ్యతలు విస్మరించారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టంలేదన్నారు. ఇక పరిపాలనా రాజధాని శంకుస్థాపనకు ప్రధానితో పాటు దేశంలోని పెద్దలను పిలుస్తామన్నారు.