ఇండియాలో కరోనా ఉదృతి పెరిగిపోతూనే ఉంది. కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇక మరణాల్లో నాల్గో స్థానంలో కొనసాగుతోంది.
మనదేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మొదట్లో చాలా నెమ్మదిగా వ్యాపించినా రానురానూ వేగంగా విస్తరిస్తోంది. మొదట్లో పది వేల మరణాలు నమోదవ్వడానికి మూడునెలలకుపైగా సమయం పట్టింది. అదే ఇప్పుడు పది వేల మరణాలకి 10 రోజులే పడుతోంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే మరణాల రేటు భారత్లో తక్కువగానే ఉంది. అమెరికాలో వేగంగా మరణాల రేటు పెరుగుతోంది.
కోవిడ్ కేసులు పెరుగుతున్నా మరణాలు మాత్రం ఇండియాలో తక్కువగానే నమోదవుతున్నాయి. ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. దేశంలో కరోనా సోకిన వారిలో ఇప్పటికే 72.5 శాతం మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ మొదట్లో 10 శాతంగా ఉన్న రికవరీ రేటు ఇప్పుడు 72 శాతానికి చేరింది.
ఇండియాలో మార్చి 12న హైదరాబాద్లో తొలి కరోనా మరణం సంభవించింది. ఆ తర్వాత 96 రోజుల్లో పదివేల మరణాలు నమోదయ్యాయి. ఆగష్టు 16 నాటికి దేశంలో మరణాల సంఖ్య 50వేలు చేరింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, జైడన్ క్యాడిలాల, బయోలాజికల్ ఈ, జెన్నోవాల నిపుణుల సమావేశం నిర్వహించింది. ఎన్ని రోజుల్లో వ్యాక్సిన్ తయారుచేస్తారు.. వీటి ధర ఏంటన్న దానిపై స్పష్టమైన నివేదికతో మరో రెండు రోజుల్లో సమావేశం అవుదామని తెలిపింది.