తెలుగు రాష్ట్రాలలో వదర పోటెత్తుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ ప్రజలు ఇళ్లలోకి రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఏపీలోని విజయవాడలో పరిస్థితి ఇలాగే ఉంది. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్.. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద సాయంత్రానికి వరద పెరిగే అవకాశముందన్నారు. ఊహించని రీతిలో భారీగా వరద వచ్చే అవకాశం ఉందన్నారు. బ్యారేజీ నుంచి ప్రస్తుతం 7.50లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నామని పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. జగ్గయ్యపేట నుంచి నదీ పరీవాహకంలోని 18 మండలాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. 9 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇక గోదావరి జిల్లాల్లో వందలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రభుత్వం ఇప్పటికే పంట నష్టపరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.