కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో శాస్త్రవేత్తలు పలు కీలక విషయాలు కనుగొంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలనుకుంటే పొరపాటు పడినట్లే.. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా వయసు మీద పడిన వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి నివేదికలు.
కరోనా సోకిన వాళ్లు చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో మృతి చెందుతుండటం తరచూ వింటూ ఉన్నాం. అయితే ఇందుకు కారణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరోనా వచ్చిన రోగుల్లో ఎక్కువ వయస్సు ఉన్న వారికి గుండెపోటు రావడం జరుగుతుందని వెల్లడించారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తలు ఈ విషయాలు పరిశోధనల ద్వారా కనుగొన్నారు. 5019 మందిపై వీళ్లు పరిశోధనలు చేశారు. వీళ్లంతా పదిహేనేళ్లకు పైగా ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నారు.
వీరిలో 14 శాతం మంది కరోనాతో ఆసుపత్రిలో చేరిన 14 రోజుల్లోనే గుండెపోటుకు గురయ్యారు. 57 శాతం మందిని సీపీఆర్ అందించడం ద్వారా కాపాడారు. 80 ఏళ్లు దాటిన వారిలో సీపీఆర్ చేసినా ఫలితం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే కరోనా వ్యాక్సిన్ వచ్చినా వయస్సు మీద పడిన వారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందేనని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మన ఇళ్లల్లో ఉండే వృద్దులను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నివేదికలు ఇప్పుడు ప్రపంచంలోని వైద్యులు మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.