సమాజంలో ఎక్కడ తప్పు జరిగినా వెంటనే స్పందించి పంచాయతీలు చెప్పే ప్రజా ప్రతినిధులు చాలా మందిపై కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ కేసుల పరిస్థితి ఎక్కువగానే ఉంది. తాజాగా సుప్రీంకోర్టుకు కోర్టు మిత్రుడిగా ఉన్న సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియా సమర్పించిన అఫిడవిట్లో సంచలనమైన విషయాలు బయటపడ్డాయి.
ఆంధ్రప్రదేశ్లో తాజీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 145 క్రిమినల్ కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. 85 కేసుల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. ఇక తెలంగాణాలో కూడా 118 కేసులు పెండింగ్లో ఉండగా ఇందులో అత్యధికంగా సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలపైనే ఉన్నట్లు తేలింది. ఓ ప్రజాప్రతినిధిపై యావజ్జీక శిక్ష పడే ఓ కేసు ఉన్నట్లు సుప్రీంకోర్టుకు అందజేసిన అఫిడవిట్లో ఉంది.
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాది లోపు పూర్తి చేయాలని 2015లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఇది జరగడం లేదని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు నిమిత్తం అన్ని రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్ జనరళ్లు సమర్పించిన సమాచారం ఆధారంగా అఫిడవిట్ అందజేశారు. ఇందులో ఏపీలో సిట్టింగ్ ఎంపీలపై 6 కేసులు, ఎమ్మెల్యేలపై 79 కేసులు, మాజీ ఎంపీలపై 7 కేసులు, మాజీ ఎమ్మెల్యేలపై 53 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి.