బాలీవుడ్ లో తెరకెక్కిన ‘3 ఇడియట్స్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమాను తమిళంలో సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ రీమేక్ చేయగా… తెలుగులోనూ ‘స్నేహితుడు’ పేరుతో డబ్ చేశారు. అయితే హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం… దక్షిణాదిన మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ సందేహం.. తాజా సమాచారం ప్రకారం ‘3 ఇడియట్స్’ను కన్నడలో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమానైనా విడుదలైన ఒకటి లేదా రెండు ఏళ్లలో రీమేక్ చేస్తారు. కానీ ‘3 ఇడియట్స్’ కన్నడ రీమేక్ ను ఏకంగా 10 ఏళ్ల తర్వాత రీమేక్ చేయాలనుకుంటున్నారు. ముంగారు మలై హీరో గణేష్, రాజేష్ కృష్ణ, పునీత్ రాజ్ కుమార్ లు ఈ రీమేక్ లో నటించనున్నట్లు సమాచారం. మరి తెలుగు, తమిళంలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయిన ఈ రీమేక్ కన్నడలో ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.