ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంత మాత్రం ఫలితాలిస్తాయో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఏపీలో జట్టుకట్టిన జనసేన రూట్ బీజేపీకి యాంటీ అవుతుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పొత్తుపెట్టుకోవడం ఎంతవరకు వెళ్తుందో తెలియడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామలను చూస్తే ఈ ఇరు పార్టీల పొత్తు బెడిసికొట్టేలా కనిపిస్తోంది. ఇందుకు కారణం ఏపీలో మూడు రాజధానులు చేస్తూ అధికార వైసీపీ నిర్ణయం తీసుకోవడమే. అయితే జనసేన మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తోంది.
ఇక భారతీయ జనతా పార్టీ మాత్రం అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని చెబుతోంది. ఏపీలో బలపడాలని అనుకునే బీజేపీ మూడు రాజధానుల విషయంలో స్పష్టమైన వైఖరితోనే ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. అయితే జనసేన మాత్రం అమరావతివైపే చూస్తోంది. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పుకుంటూ పార్టీల విధానాల్లో మార్పులు ఉంటే ఎలా అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలకు ఏ హామీ ఇచ్చి ముందుకు వెళతారో అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
అయితే 2024 ఎన్నికలకు ఇంకా టైం ఉంది. అయితే ఏపీలో తిరుపతి లోక్సభకు జరిగే ఉప ఎన్నికలో బరిలో ఉంటామని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఇక్కడే చిక్కు వచ్చి పడింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, జనసేన నేతలు పాల్గొంటారు. ప్రధానంగా అమరావత రాజధానిగా ఉండాలన్న జనసేన పార్టీ నేతల వైఖరిని ప్రజలు ఎలా స్వీకరిస్తారు. మూడు రాజధానుల వల్ల రాయలసీమలోని కర్నూలు జిల్లాలో న్యాయ రాజధాని వస్తోంది. దీన్ని కాదంటూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటున్న జనసేనతో పొత్తుపెట్టుకున్న బీజేపీని ప్రజలు విశ్వసిస్తారా అంటే కచ్చితంగా నమ్మరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మందుకు వెళతారో అర్థం కాని పరిస్థితి. దీంతో ఈ రెండు పార్టీల పొత్తు ఎలా కుదురుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.