ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్దమైన విషయంపై పవన్ కల్యాణ్ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. దీనిపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పవన్ కోరారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, నెల్లూరు జిల్లా కొండ బిర్రగుంట, అంతర్వేదిలో జరిగిన సంఘటనలు యాదృచ్చికంగా జరిగినవి కాదన్నారు. అంతర్వేది రథం దగ్దం విషయంలో మతిస్థిమితం లేని వారు చేశారంటే చిన్న పిల్లలు కూడా నవ్వుతారన్నారు. ఇతర మతాల పెద్దలు ఇలాంటి ఘటనలు ఖండించాలన్నారు.
ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరపకుండా సీబీఐ విచారణకు కేంద్రాన్ని కోరతామని పవన్ అన్నారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు. ఈ ఘటనపై ఆడపడుచులంతా మంగళ, శుక్ర వారాల్లో హారతులిస్తూ నిరసనలు తెలుపాలన్నారు. హిందూ విశ్వాసాలను వెనకేసుకొస్తే మతం అంటగడతారన్న భయాలేవి తమకు లేవన్నారు. ముస్లీం, క్రైస్తవ మత సాంప్రదాయాలను ఎలా గౌరవిస్తామో హిందూ సమాజాన్ని తమ పార్టీ అంతే గౌరవం ఇస్తుందని పవన్ చెప్పారు.
మరి పవన్ కోరినట్లు ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.