పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే వారికోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగానే ఎంపీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవ్వనున్నాయి. దీంతో పార్లమెంటులో ఉండే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. శనివారం లోక్సభ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. వీరితో పాటు ఎంపీలకు కూడా టెస్టులు చేస్తారు.
ప్రతి ఒక్క ఎంపీ కరోనా పరీక్ష చేయించుకోవాలని పార్లమెంటరీ మంత్రిత్వశాఖ కీలక సూచనలు చేసింది. సమావేశాలకు 72 గంటల ముందు ఎంపీతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పీఏలు, పీఎస్లు, డ్రైవర్లందరూ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
వీరిలో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా సదరు ఎంపీ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఇక పరీక్షలు చేయించుకోకుండా పార్లమెంటుకు వచ్చే ఎంపీలకు పార్లమెంటు భవనంలో టెస్టులు చేస్తారు. నెగిటివ్ వస్తే లోపలికి పంపుతారు. పాజిటివ్ వస్తే వెంటనే వైద్యుల సలహాతో చికిత్స తీసుకోవాలని ఇప్పటికే సూచించారు. ఇక నెగిటివ్ వచ్చినా లక్షణాలు ఉంటే లోపలికి అనుమతించరు. ఇక పార్లమెంటులో నిర్వహించే ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్ష ఫలితాలు ఒక్క రోజులో వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.