తిరుమల విషయంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై ఇప్పటికే టిడిపి, బీజేపీ, ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు స్వామి పరిపూర్ణానంద కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయల గురించి మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
మంత్రి వ్యాఖ్యలు సీఎం జగన్కు వినిపిస్తున్నాయో లేదో అన్నారు. తిరుమల దర్శనానిక వెళితే ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు తాను గతంలో ఎప్పుడూ వినలేదన్నారు. జగన్ ప్రభుత్వానికి 150 సీట్లు వచ్చాయని, అందులో 149 స్థానాలు హిందువులు ఓట్లు వేస్తేనే వచ్చాయన్నారు. ఇలాగే జరిగితే హిందువులు జగన్ పై పెట్టుకున్న నమ్మకం పోతుందన్నారు. తిరుమల డిక్లరేషన్లో 42 పాయింట్ల ఉన్నాయని.. ఇతర మతస్థులు వెళితే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. తిరుపతి ఎవడబ్బ సొత్తు అనడం చాలా దారుణమైన అంశమని, తిరుమల డిక్లరేషన్ పై ప్రశ్నించడం అహంకారమే అవుతుందని అన్నారు.
హిందువుల మనోభావాలను సీఎం జగన్ కచ్చితంగా గౌరవించాల్సిందేనని పరిపూర్ణానంద స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని, మంత్రి నాని లాంటి వాళ్లు ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు. ఇక నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని, జగన్ స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని పరిపూర్ణానంద స్వామీజీ పేర్కొన్నారు.