పాకిస్తాన్ రెచ్చిపోతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పాక్ ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి ఇష్టమొచ్చినట్లు పాక్ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు వదిలాడు. ఇక పాక్పై భారత్ అదే రీతిలో పోరాడుతోందని తెలుస్తోంది.
భారత్లో భారీ ఉగ్రకుట్రకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తే దాన్ని భారత సైన్యం చాకచక్యంగా అడ్డుకుంది. నలుగురు ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టింది. ఈ విషయంపై స్వయంగా ప్రధాని మోదీ సైతం స్పందించిన విషయం తెలిసిందే. కాగా నేడు మరోసారి పాక్ కాల్పులు జరిపింది. జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో, నౌషేరా సెక్టర్లో నియంత్రణ రేఖ వెంబడి శనివారం పాకిస్థాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో ఓ భారతీయ జవాను అమరుడయ్యారు.
పాకిస్థాన్ దళాలకు భారతీయ దళాలు దీటుగా బదులిస్తున్నట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొంది. కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ అని సైన్యం తెలిపింది. సంగ్రామ్ శివాజీ మొదట తీవ్రంగా గాయపడ్డారని, ఆ తర్వాత కొద్ది సేపటికి తుది శ్వాస విడిచారని తెలిపింది. ఆయన ధైర్యసాహసాలు, నిజాయితీగల సైనికుడని తెలిపింది. ఆయన కర్తవ్యబద్ధతకు, అంకితభావానికి మన దేశం రుణపడి ఉంటుందని నివాళులర్పించింది.