అమెరికాలో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందజేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుంది. ఈ క్రమంలో ఔషధ, నియంత్రణ సంస్థ అనుమతించిన వెంటనే వ్యాక్సిన్ను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటోంది. ఈ ఏడాది చివరికి 40 మిలియన్ల డోసులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది.
ఈ పనులన్నీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్గనిర్దేశనం వల్లే సాధ్యమయిందని అధికార ప్రతినిధి కేలే మెకనీ అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఆలోచన నుంచి పుట్టిన ఆపరేషన్ వార్ప్ స్పీడ్ వల్లే ఇది సాధ్యమవుతోందని వ్యాఖ్యానించారు. టీకా పంపిణీ ప్రణాళికపై ట్రంప్ పాలకవర్గం అలసత్వం ప్రదర్శిస్తోందన్న బైడెన్ బృందం ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. అమెరికాలోని పీఫైజర్, మొడెర్నా సంస్థలు తమ వ్యాక్సిన్లు 90శాతానికి పైగా సామర్థ్యం కలిగి ఉన్నట్లు ప్రకటించాయి.
అయితే, జులైలో పీఫైజర్ అభివృద్ధి, తయారీకి ట్రంప్ పాలక వర్గం 1.95 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ని ప్రశంసిస్తూ మెకనీ తాజా వ్యాఖ్యలు చేశారు. జనవరి నుంచే వ్యాక్సిన్ అభివృద్ధిపై ట్రంప్ దృష్టి సారించారని తెలిపారు. టీకా అందజేయడానికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించారన్నారు. ఈ క్రమంలో దేశంలో 64 స్థానిక పాలనా యంత్రాంగాలతో కలిసి ప్రత్యేక పంపిణీ విధానానికి రూపకల్పన చేశారన్నారు. కాగా అమెరికాలోని ఔషధ తయారీ సంస్థలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తాజాగా ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ఫార్మా కంపెనీలన్నీ ఏకమై తనపై దుష్ప్రచారం చేశాయని ఆరోపించారు. అందుకోసం మిలియన్ల డాలర్లు వెచ్చించారన్నారు. బడా సాంకేతిక, మీడియా సంస్థలు తమకు వ్యతిరేకంగా పనిచేశాయన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ మరోసారి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బైడెన్ కాదని, తానే గెలిచానని చెప్పుకొచ్చారు.