మోదీ పాకిస్తాన్ మ‌ధ్య మాట‌ల యుద్ధం..

భార‌త్ స‌రిహ‌ద్దులో పాక్ అవ‌లంభిస్తున్న చ‌ర్య‌ల‌తో పాటు ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న విధానాల‌పై భార‌త్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇటీవ‌ల న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను భార‌త జ‌వాన్లు మ‌ట్టుబెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈ విష‌యంలో ప్రధాని మోదీ స్పందిస్తూ భారత భద్రతా దళాలను ప్రశంసించారు. ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టడం ద్వారా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మన దేశంలో భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను భగ్నం చేశారని ప్రశంసించారు.

ఆ వెంట‌నే పాకిస్తాన్ స్పందించింది. భార‌త్‌పై ఎదురుదాడికి దిగింది. జమ్మూ-కశ్మీరులోని పరిస్థితి నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు భారత దేశం నైరాశ్యంతో ప్రయత్నిస్తోందని ఆరోపించింది. మోదీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి భారత దేశం మద్దతిస్తోందని ఆరోపించింది. ఉగ్రవాదానికి భారత్ మద్దతిస్తున్నట్లు తెలిపే నిఖార్సయిన సాక్ష్యాధారాలను పాకిస్థాన్ అందజేయడంతో, పాకిస్థాన్‌పై వ్యతిరేక ప్రచారాన్ని భారత్ ముమ్మరం చేసిందని ఆరోపించింది. ఉగ్రవాద చర్యల్లో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టి, భారీ దాడికి కుట్రను భగ్నం చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ సీనియర్ దౌత్యవేత్తను పిలిచి, ఉగ్రవాదాన్ని విడనాడాలని హితవు పలికింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోని ఛార్జ్ డీఅఫైర్స్ అఫ్తాబ్ హసన్ ఖాన్‌ను పిలిచింది. పాకిస్థాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు మద్దతిచ్చే విధానాలను విడనాడాలని డిమాండ్ చేసింది.

ఇతర దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉగ్రవాద సంస్థలు పాక్ గడ్డపై ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదంపై పోరులో దేశ భద్రతను కాపాడుకోవడం కోసం తీసుకోవలసిన అన్ని చర్యలు తీసుకుంటామని గట్టిగా చెప్పింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here