అవకాశం దొరకితే చాలు పాకిస్తాన్ భారత్ విషయంలో విధ్వంసం సృష్టించేందుకు రెడీగా ఉంటుంది. నియంత్రణ రేఖ వెంబడి ఎప్పుడూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తూనే వస్తుంది. తాజాగా మరోసారి పాక్ కాల్పులకు పాల్పడింది. అయిదే ఈ కాల్పుల్లో ఎవ్వరూ చనిపోలేదు.
నియంత్రణ రేఖ వెంబడి ఇంద్రాణి సెక్టర్లో భారత సైన్యంపై కాల్పులు జరిపింది. పాక్ ఇలా కాల్పులు జరపడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది ఇప్పటికే అనేకసార్లు పాక్ సైనికులు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైనిక పోస్టులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ దుశ్చర్యలను భారత సైన్యం కూడా దీటుగా తిప్పి కొడుతూ వస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి పాక్ రేంజర్లు కాల్పులకు దిగడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బెటాలియన్ తిప్పి కొట్టింది. దాదాపు 4 గంటల పాటు ఈ కాల్పులు కొనసాగాయి. శనివారం తెల్లవారుజామున పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి.
అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కొందరు సైనికులకు మాత్రం గాయాలయ్యాయని భారత సైన్యం తెలిపింది. లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో కూడా పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఉంది. పాక్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు పాల్పడటం మామూలు విషయమై పోయింది. సరిహద్దులో భారత సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. కాగా ఉగ్రవాదులు సైతం అక్రమ మార్గాల్లో భారత్లోనికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా సైన్యం అడ్డుకుంటూనే ఉంది.