పాకిస్థాన్ తన వక్రబుద్దిని చాటుకుంటూనే ఉంది. ఓసారి భారత్పై దాడి చేసింది తామే అని ఒప్పుకుంది. అయితే అలా ప్రకటించిన మరుసటి రోజే తన మాటను మార్చుకుంది. దీంతో పాక్ ద్వంద వైఖరి మరోసారి రుజువైందని అంతా అనుకుంటున్నారు.
పుల్వామా దాడి భారత్ను తీవ్రంగా బాధించింది. అప్పటి నుంచి భారత్ మరింత అప్రమత్తమైందని చెప్పొచ్చు. అయితే ఆ దాడి గురించి పాక్ తాజాగా మాట్లాడింది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని ప్రకటించి…. 24 గంటలైనా గడవలేదు… పాకిస్తాన్ అప్పుడే మాట మార్చేసింది. పైగా బుకాయింపులకు దిగుతోంది. ఆ దాడితో తమకెలాంటి సంబంధమూ లేదని, తమ మాటలను వక్రీకరించారని మంత్రి ఫవాద్ ప్రకటించారు. పుల్వామా దాడి తర్వాత పరిస్థితులనే తాను ప్రస్తావించానని తెలిపారు.
పుల్వామా దాడి తర్వాత భారత్ తో జరిగిన వైమానిక దాడి గురించే పరోక్షంగా ప్రస్తావించామని, అమాయకులను చంపి మేం ధైర్యవంతులమని ప్రకటించుకోవాలని తాము భావించడం లేదని అన్నారు. ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి ఫవాద్ తెలిపారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌధరి గురువారం ప్రకటించారు. మనం భారత్ ను వారి గడ్డమీదే దెబ్బకొట్టామన్నారు. పుల్వామాలో మనం విజయం సాధించామని. ఇది ఇమ్రాన్ నేతృత్వంలోని పాక్ కు దక్కిన గెలుపు. ఈ విజయంలో మనమంతా భాగస్వాములమే అన్నారు.