ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. దీంతో మోదీతో సహా ఆయన అభిమానులు పార్టీ నేతలంతా సతోషంలో మునిగిపోతున్నారు. మరోవైపు దేశంలో నిరుద్యోగం ఎక్కువైందంటూ వస్తున్న ట్వీట్లు మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.
ప్రధాని మోదీ పుట్టిన రోజు అంటే ప్రపంచ వ్యాప్తంగా అభినందనలతో సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్లకు శ్రీకారం చుడుతుంది. అయితే ఈసారి ఇది రివర్సైంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు ట్విట్టర్ను మారుమోగిస్తోంది. మోదీ పుట్టిన రోజుకు వచ్చిన ట్వీట్ల కంటే ఇంచుమించు పదిరెట్లు ఎక్కువ ట్వీట్లతో ఇండియాలో నెంబర్ వన్ ట్రెండింగ్గా నిలిచింది. హ్యాపీ బర్త్డే పీఎం మోదీ అనే హ్యాష్ట్యాగ్పై ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా ట్వీట్లుర వచ్చాయి. అయితే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన నేషనల్ అన్ఎంప్లాయిమెంట్ డే (జాతీయ నిరుద్యోగ దినోత్సవం)కు 40 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు నిరుద్యోగానికి సంబంధించిన ఓ కథనాన్ని ఆయన షేర్ చేశారు. ప్రభుత్వం ఎన్ని రోజులు దీన్ని తాత్సారం చేస్తుందని ఆయన హిందీ,ఇంగ్లీషులో రాశారు. కాగా సెప్టెంబర్ 17న నిరుద్యోగ దినోత్సవం నిర్వహించాలని, దాని కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన తెలపాలని కొద్ది రోజుల క్రితమే పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగానే బుధవారం అర్థరాత్రి నుంచే ట్విట్టర్లో నెటిజెన్లు పోస్టులతో నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు.