ఉత్తరప్రదేశ్లో హథ్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఘటన జరిగినప్పటి నుంచి బాదితురాలు మృతి చెందడం, ఆమె అంత్యక్రియల వరకు అన్నీ వివాదాస్పదంగానే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది.
హథ్రాస్ ఘటనలో బాదితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీపై మండిపడుతున్నారు. అంత్యక్రియలు కూడా తమను అడిగి చేయలేదని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో బాదితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నేతలు ముందుకొస్తున్నారు. నిన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హథ్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకుంది.
తాజాగా నేడు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, ఇతర పార్టీ నాయకులు వెళుతుండగా ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో నాయకులు కిందపడిపోయారు. హథ్రాస్కు వెళ్లేందుకు రాజకీయ నాయకులను పోలీసులు అనుమతించడం లేదు. ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ జరిగిన పరిస్థితి నేడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హథ్రాస్కు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసి నేతలను అడ్డుకుంటున్నారు.
ప్రముఖ న్యాయవాది సీమా కుష్వాహా కూడా హథ్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈమె కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసును ఈమెనే వాదించాలని బాదితురాలి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలుస్తోంది. ఈమె నిర్భయ కేసును వాదించి గెలిచిన విషయం తెలిసిందే.