జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు ఆయన అభిమానులకు చేదు వార్త ఎదురైంది. మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సేకి అనుకూలంగా లక్షల మంది లైక్లు కొడుతూ ప్రశంశిస్తున్నారు. దీంతో గాంధీ అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
గాంధీని హత్య చేసింది గాడ్సే అని అందిరకీ తెలిసిందే. అలాంటిది మహాత్మాగాంధీ 151 జయంతి రోజు గాడ్సేపై ప్రశంసలు రావడం ఇండియన్లకు చేదువార్తే. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మరణలతో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఇదే రోజున గాంధీ హంతకుడు గాడ్సేకి అనుకూలంగా ట్విట్టర్లో ట్రెండింగ్ రావడం గమనార్హం. ‘‘నాథూరాం గాడ్సే జిందాబాద్’’ అనే హ్యాష్ట్యాగ్తో ఇప్పటికే లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. కొంత మంది గాడ్సేకు అనుకూలంగా పరోక్షంగా ట్వీట్లు చేయగా మరికొంత మంది నేరుగానే గాడ్సేపై ప్రశంసలు కురిపిస్తూనే గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ హ్యాష్ ట్యాగ్ ఈరోజు ఉదయం 5 గంటలకు ఇండియా ట్రెండింగ్లోకి వచ్చింది. దీనిపై ట్విట్టర్ స్పందిస్తూ ట్విట్టర్ అల్గారిథమ్ రోజువారి ప్రాచుర్యం పొందిన అంశాలకంటే జనాదరణ పొందిన అంశాలు.. నెటిజెన్లు ఎక్కువగా చర్చించుకునే అంశాలను ప్రధానంగా తీసుకుంటుందని పేర్కొంది. కాగా గాంధీకి వ్యతిరేకంగా పలు సంఘటనలు జరగడం ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా ఇవి జరిగాయి.