ఇండియా, చైనా మధ్య గొడవ సద్దుమనిగిపోయిందా.. బార్డర్లో మొహరించిన ఇరు దేశాల సైన్యాలు ఎక్కడకక్కడ వెనక్కు వెళ్లనున్నాయా.. వివాదం విషయంలో ఇండియా, చైనాలు ఏమంటున్నాయి.
భారత్ చైనా సరిహద్దు వివాదం గత కొద్ది రోజులుగా మళ్లీ వేడెక్కిన విషయం తెలిసిందే. అయితే మునుపెన్నడూ లేనంతగా ఈ సారి మాత్రం యుద్ధం జరిగే స్థాయికి ఇది వెళ్లింది. ఓ పక్క చైనా రహస్యంగా బలగాలను మొహరించింది. ఇందుకు ధీటుగా ఇండియా కూడా చైనాకు బుద్దిచెప్పేందుకు బలగాలను తరలించి సరిహద్దులో మొహరింపజేసింది.
ఈ మధ్య ఇరు దేశాలు చర్చలు నడిపిన సందర్బంగా వివాదం ముగిసిపోయిందని అనుకుంటున్న తరుణంలో చైనా మళ్లీ చర్చల వాతావరణాన్ని పక్కన పెట్టేసి బలగాలను బార్డర్కు తరలించింది. దీంతో చైనా వక్రబుద్దిని గ్రహించిన ఇండియా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన చర్చల్లో ఇరు దేశాలు శాంతిని పునరుద్దరించేందుకు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయ కార్యచరణ యంత్రాంగం కింద ఇరుదేశాలు ఆన్లైన్ ద్వారా దౌత్య సమావేశాలు నిర్వహించాయి. చర్చల ఒప్పందం ప్రకారం చైనా తన బలగాలను ఉపసంహరించుకోవాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. మరోసారి సైనిక సమావేశాలు నిర్వహించాలని ఇరువురూ నిర్ణయించారు. ఇదిలాఉంటే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెంజమిన్తో మాట్లాడి తమకు సరఫరా చేస్తామన్న ఆయుధాలు, మందుగుండును వేగంగా అందించాలని కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.