యనమల మాటల్లో వాస్తవాలు లేవు: ఆర్థిక మంత్రి బుగ్గన

దేశవ్యాప్తంగా 2019 నుంచి ఆర్థిక మాంద్యం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం అంచనాలు, లక్ష్యాలను ఎప్పుడూ అందుకోలేదని విమర్శించారు. వారి హయాంలో రెండంకెల వృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో మూడేళ్ల అంచాలు వరుసగా తగ్గాయని తెలిపారు. 2018-19లో ఎంతో ఆర్థిక ప్రగతి సాధించినట్టు చెప్పుకున్నారని.. కానీ టీడీపీ నేత యనమల చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవని చెప్పారు. రెవెన్యూ రాబడి 40 శాతం పడిపోయిందని ఎలా చెబుతున్నారని నిలదీశారు.

టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా అంచనాలు పెంచారని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సరిచేశామని చెప్పారు. గత ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని తెలిపారు. ద్రవ్యోల్బణం విషయంలోనూ యనమల తప్పుడు లెక్కలే చెప్పారని మండిపడ్డారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలరాసిందని కూడా అబద్ధాలు చెప్పారు. 2018-19లో సంక్షేమానికి టీడీపీ 5600 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.  తాము అధికారంలోకి వచ్చాక బీసీ సంక్షేమానికి రూ. 20,100 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు.పేదలకు అన్ని విధాల సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ఉన్నామని.. ఎక్కడ కోత విధించడం కానీ, తగ్గించడం కానీ చేయలేదని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం 3 కోట్లకు పైగా లబ్దిదారులకు రూ. 42 వేల కోట్లు అందించిందని తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు మొత్తం ప్రభుత్వమే చెల్లించిందని గుర్తుచేశారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని తెలిపారు.కేంద్రం అన్ని విధాల సహకరిస్తామని చెబితే.. తన ఢిల్లీ పర్యటనపై పచ్చ మీడియాలో అసత్య వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఏపీకి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా పేదలకు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here